భూ యాజమాన్య చట్టంలో సవరణల వల్ల భూ లావాదేవీలు మరింత పారదర్శకం అవుతాయి. ''మార్పు అవకాశాన్ని తెస్తుంది'' అని నిడో కుబైన్ సరిగ్గానే చెప్పారు. కానీ, భారతదేశంలో మాత్రం.. స్థూల స్థాయిలో విధాన నిర్ణయాల్లో మార్పులతో పాటు వచ్చిన అనేకానేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో అంతగా విజయవంతం కాలేకపోయామన్న విషయానికి చరిత్రే సాక్ష్యంగా నిలుస్తుంది. వాటిలో ఒకటి భూ నియంత్రణ.. ఇది ఎపడో 1970ల నాటిది. భూమి వినియోగం, దాంతో వ్యాపారం చేయడం అనే విషయాల్లో గణనీయమైన మార్పులు వచ్చినా, భూయాజమాన్య చట్టాల్లో మాత్రం ఇప్పటికీ తగినంత మార్పు రాలేదు.
నాటి ఈ చట్టం ఒకవైపు ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను ప్రభావితం చేస్తుండగా, మరోవైపు పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు 'అక్రమ' పద్ధతులు పాటించడానికి కారణం అవుతోంది. అలాగే హర్యానాలోని 1972 నాటి సీలింగ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్స్ యాక్ట్ (లాండ్ సీలింగ్ చట్టం) కూడా ఏమంత విభిన్నమైనది కానేకాదు. ఈ చట్ట ప్రకారం వ్యవసాయేతర భూమి అయితే గారిష్ఠంగా 7.5-18 హెక్టార్లు మాత్రమే కలిగి ఉండొచ్చు. 1970ల నాటికి వెళ్తే, అప్పట్లో రాష్ట్రం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేది. వ్యవసాయ అవసరాల కోసం భూమిని కాపాడుకోడానికి, భూమిని అసంబద్ధంగా వాడకుండా ఉండటానికి ఇలాంటి చట్టం అవసరం ఎంతగానో కనపడేది. కానీ నాటికీ నేటికీ కాలం చాలా మారిపోయింది. గుర్గావ్, ఫరీదాబాద్ లాంటి నగరాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీకి శివారు నగరంగా ఉన్న గుర్గావ్ ఇప్పుడు దేశంలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. ప్రస్తుతం గుర్గావ్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఫరీదాబాద్ కూడా ఏమంత వెనకబడి లేదు.
అందువల్ల.. పెరుగుతున్న పారిశ్రామికీకరణ డిమాండ్లకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు ల్యాండ్ సీలింగ్ చట్టాలను అడ్డంగా ఉల్లంఘించడం కళ్లెదుటే కనిపిస్తుంది. మౌలిక సదుపాయాలు.. ముఖ్యంగా ఇళ్లు, పారిశ్రామిక ప్లాంట్ల నిర్మాణానికి భూమి బాగా అవసరమవుతోంది. దాంతో సహజంగానే చట్టాన్ని ఉల్లంఘిస్తూ బినామీ ఆస్తులు కూడగట్టుకోవడం కూడా ఎక్కువైంది. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు వారిలో చాలామంది (రియల్ ఎస్టేట్ కంపెనీలు, పారిశ్రామిక యూనిట్లు) వేర్వేరు పేర్లతో చిన్న చిన్న భూములను కొనడం మొదలుపెట్టారు.
అయితే ఇప్పటికే ఆలస్యం అయినా.. హర్యానా రాష్ట్రం ఎట్టకేలకు ఈ విషయంలో మరింత పారదర్శకతను తేవాలని నిర్ణయించుకుంది. అందుకే హర్యానా శాసనసభ ఇటీవల సీలింగ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్స్ (ఎమెండ్మెంట్) బిల్లు-2011ను ఆమోదించింది. దీని ప్రకారం పట్టణ, పారిశ్రామిక జోన్లలో వ్యవసాయేతర భూమి యాజమాన్యంపై వ్యక్తులు, సంస్థలకు ఎలాంటి సీలింగ్ ఉండబోదు. 1975 తర్వాత నుంచి ఉన్న అన్ని రకాల వ్యవసాయేతర భూమి యాజమాన్యాలకు ఈ కొత్త చట్టం అమలవుతుంది. వ్యవసాయాధారిత రాష్ర్టాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా రూపొందించేందుకు ఇలాంటి చట్ట సవరణలు ఎంతగానో అవసరం.
ఇదే తరహాలో హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కూడా హెచ్పీ సీలింగ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్స్ (ఎమెండ్మెంట్) బిల్లును ప్రతిపాదించింది. కానీ హిమాచల్ ప్రదేశ్లో ఈ సమస్య హర్యానాలో ఉన్నంత సులభంగా లేదు. ఈ బిల్లుపై వివిధ రాజకీయ పార్టీలు పరస్పరం నిందారోపణలు చేసుకోవడం మొదలుపెట్టాయి.
దేశంలో ఇక్కడ.. అక్కడ అని లేకుండా ప్రతిచోటా భూములకు సంబంధించిన స్కాములు బయటపడుతుండటం, అది దేశ సాంఘిక, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుండటంతో భూయాజమాన్య చట్టాల్లో సవరణలు తప్పనిసరి అవుతున్నాయి. చాలా సందర్భాలలో బాధలు పడేవారు మధ్యతరగతి మానవులే అవుతున్నారు. వారు తమ జీవితకాలం సంపాదించిన మొత్తాన్ని వీటిమీద పెట్టుబడి పెట్టి.. చివరకు దేనికీ కొరగాకుండా పోతున్నారు.